karnataka: కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు.. 20 మంది జలసమాధి!

  • కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘటన
  • కావేరీ కేసీ కాలువలో పడిపోయిన బస్సు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పడంతో ఇక్కడి కావేరీ కేసీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మంది ప్రజలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బస్సు కాలువలోకి దూసుకెళ్లడంతో అటుగా వెళుతున్న ప్రజలు నీళ్లలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశారు. మరికొందరు విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందించారు.

మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న ఈ ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామం సమీపంలో కాలువలోకి జారిపోయింది. ఈ విషయమై స్థానిక పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కాలువలో నీటి ప్రవాహం నిండుగా ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో విద్యార్థులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

More Telugu News