Kurnool District: యువతి ప్రేమ వ్యవహారం.. డోన్ లో రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న ఇంటర్ విద్యార్థులు!

  • డోన్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వివాదం
  • రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు
  • 20 మందిని స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు

కర్నూలు జిల్లా డోన్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు రెచ్చిపోయారు. ఓ యువతి ప్రేమ వ్యవహారానికి సంబంధించి రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ విద్యార్థులంతా కొత్తకుంట, హుస్సైనిపురం గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది. డోన్ లో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొత్త కుంట, హుస్సైనిపురం గ్రామాల విద్యార్థులు డోన్ లోని ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువతితో ప్రేమ విషయమై రెండు గ్రామాల యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది మరింతగా ముదరడంతో దాదాపు 30 మంది విద్యార్థులు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. స్థానికులు అడ్డుకునేందుకు యత్నించగా..‘ఇది కాలేజీ గొడవ. మీరు జోక్యం చేసుకోవద్దు’ అని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న డోన్ పోలీసులు 20 మంది విద్యార్థులను స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ ఘర్షణలో ముగ్గురు విద్యార్థులకు బలమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, విద్యార్థుల గొడవ నేపథ్యంలో కొత్తకుంట, హుస్సైనిపురం గ్రామాల మధ్య సైతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

More Telugu News