Telangana: కేసీఆర్ ఇంట్లో పడుకుంటే.. మనవడు సచివాలయానికి వచ్చి స్నేహితులతో గోటీలు ఆడుతున్నాడు!: రేవంత్ రెడ్డి ఎద్దేవా

  • సోనియా, రాహుల్ పై విమర్శలు దారుణం
  • ఓ సభలో మనవడిని స్టేజీ ఎక్కించారు
  • టీఆర్ఎస్ నేతలపై రేవంత్ ఫైర్

యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొడితే మాత్రం చిన్న పిల్లలను దూషిస్తారా? అంటూ తమపై ఎదురుదాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ ను బఫూన్ అనీ, సోనియాను బొమ్మ అని సీఎం సంబోధించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రపంచంలో ఎవరికీ కొడుకులు లేనట్లు కేటీఆర్, మనవడు లేనట్లు కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఇంట్లో పడుకుంటే ఆయన మనవడు హిమాన్షు మాత్రం స్నేహితులకు వచ్చి గోటీలు(గోళీలు) ఆడుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన విజయోత్సవ సభలో టీఆర్ఎస్ కండువా కప్పుకుని కేసీఆర్ పక్కనే ఆ పిల్లాడు కూర్చున్న విషయాన్ని గుర్తుచేశారు.

భద్రాద్రిలో శ్రీరాముడి ఉత్సవాలకు సీఎం అందించాల్సిన పట్టు వస్త్రాలను బడి పిల్లలతో ఇప్పించడం ఆ దేవుడిని అవమానించడమేనని స్పష్టం చేశారు. తన మనవడు తిన్న సన్నబియ్యమే మిగతా పిల్లలకు పెడుతున్నామని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే హిమాన్షు గురించి ప్రస్తావించాల్సి వచ్చిందని చెప్పారు. అసలు సీఎం మనవడిని రాష్ట్రానికి రోల్ మోడల్ గా చూపడం ఏంటని ప్రశ్నించారు.

More Telugu News