Andhra Pradesh: కాలేజీ విద్యార్థినులను వేధించిన విజయవాడ పోలీసులు.. నిందితులకు అండగా నిలిచిన ఉన్నతాధికారులు!

  • స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చిన యువతులు
  • మఫ్టీలో వచ్చి వేధింపులకు పాల్పడ్డ పోలీసులు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దారితప్పారు. పూటుగా మద్యం సేవించి బస్టాండ్ లో ఉన్న కాలేజీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఇద్దరు యువతులు పెప్పర్ స్ప్రే వాడి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో దాదాపు 10 రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతజరిగినా పోలీస్ అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు యత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

విజయవాడలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు 10 రోజుల క్రితం స్వస్థలానికి వెళ్లేందుకు బస్టాండ్ కు చేరుకున్నారు. ఇంతలోనే అక్కడకు మద్యం మత్తులో మఫ్టీలో అక్కడకు చేరుకున్న ఇద్దరు పోలీసులు వీరితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తాము తెలంగాణ పోలీసులమనీ, తమతో రావాలని వేధించారు.

వెంటనే తేరుకున్న యువతులు.. తమ వద్ద ఉన్న పెప్పర్ స్ప్రేను ప్రయోగించి అక్కడి నుంచి తప్పించుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

More Telugu News