Uttam Kumar Reddy: మరో రెండు రోజుల్లో టీఆర్ఎస్ కు షాక్ తగలబోతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • టీఆర్ఎస్ నుంచి భారీ సంఖ్యలో వలసలు ఉన్నాయి
  • టీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు
  • సోనియా సభకు మహాకూటమి నేతలందరినీ ఆహ్వానించాం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతోందని... ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీ సంఖ్యలో వలసలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ లో చేరేందుకు టీఆర్ఎస్ కీలక నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఇచ్చిన మాటలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుపుకోలేదని ఉత్తమ్ అన్నారు. ముస్లింలు, గిరిజనులు, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగున్నాయని చెప్పారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మహాకూటమే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ఈ సాయంత్రం మేడ్చల్ లో జరగనున్న సభలో సోనియాగాంధీకి పౌరసన్మానం జరుగుతుందని... ఈ సభకు మహాకూటమి నేతలందరినీ ఆహ్వానించామని చెప్పారు. 

More Telugu News