Nandyal: ప్రేమలో పడిన వివాహిత.. వదిలి ఉండలేక ఆత్మహత్యా యత్నం.. ప్రియుడి మృతి!

  • నంద్యాలలో జంట ఆత్మహత్యాయత్నం
  • ప్రియుడు మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

వివాహమైన పదేళ్ల తరువాత, తనకు పరిచయమైన ప్రియుడిని వదిలి ఉండలేని ప్రియురాలు, ఆమెను వదిలి ఉండలేని అతను కలసి ఆత్మహత్యాయత్నం చేశారు. నంద్యాలలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, పులివెందులలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రఘుకు దివ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది.

ఇద్దరి వయసు వ్యత్యాసం 23 ఏళ్లు. వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన శ్రావణ్ కుమార్, నెల్లూరులో ఏపీ జెన్ కోలో పని చేస్తుండగా, ఏడాది క్రితం దివ్యకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారగా, అప్పుడప్పుడూ రహస్యంగా కలుస్తుండేవారు. ఈ నెల 13న దివ్య అతని వద్దకు వెళ్లగా, భార్య అదృశ్యమైందని రఘు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై తిరుపతికి వెళ్లిన ఇద్దరూ, రైలులో నంద్యాలకు వచ్చారు. తాము బతకలేమని, చనిపోతున్నామని శ్రావణ్ కుమార్ తన బంధువులకు ఫోన్ చేశాడు. వారు వారిస్తుంటే వినకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు.

ఆపై రైల్వే స్టేషన్ వెలుపల శీతల పానీయాలు కొని, అందులో పురుగుల మందు కలిపి తాగి, స్టేషన్ లోనికి వెళుతూ ఆవరణలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఇద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారు పోలీసులకు తమ పేర్లు, చిరునామాలు మాత్రమే చెప్పారు. చికిత్స పొందుతూ శ్రావణ్ కుమార్ మృతి చెందగా, దివ్య పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.

More Telugu News