Chandrababu: ఆంధ్రా, గీంధ్రా అనొద్దు.. చంద్రబాబుకే దిక్కులేదు: చిత్తూరు జిల్లా చెక్‌పోస్టు ఉద్యోగి వీరంగం

  • చెక్‌పోస్టులో సీఎంపై అసభ్య పదజాలం
  • వీడియో తీసి మంత్రికి పంపిన లారీ డ్రైవర్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని నరహరిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఓ కలెక్షన్ ఏజెంట్ వీరంగమేశాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఇష్టం వచ్చినట్టు దూషించాడు. విషయం కాస్తా మంత్రి దృష్టికి వెళ్లడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. అతడు అసలు ఉద్యోగే కాదని, మామూళ్ల వసూలు కోసం చెక్ పోస్టు సిబ్బంది నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి అని తేలింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు జిప్సం లోడుతో వెళ్తున్న లారీని బుధవారం చెక్‌పోస్టు వద్ద రవాణా సిబ్బంది అడ్డుకున్నారు. లోడుకు సంబంధించి పూర్తి పత్రాలు చూపించి వదిలేయాలని డ్రైవర్ కోరాడు. అయితే, మామూలు ఇవ్వకుంటే వదిలేది లేదని ఉద్యోగి తేల్చి చెప్పాడు. తాను నిత్యం ఇదే రూట్‌లో తిరుగుతుంటానని, తనదీ ఆంధ్రాయేనని డ్రైవర్ పేర్కొన్నాడు.

లారీ డ్రైవర్ మాటలతో ఉద్యోగికి చిర్రెత్తు కొచ్చింది. ‘‘ఆంధ్రా, గీంధ్రా అని మాట్లాడొద్దు. ఇక్కడ చంద్రబాబుకే దిక్కులేదు. మామూలు ఇచ్చే ఉద్దేశం ఉంటేనే మళ్లీ ఈ రూట్‌లో రా. ఈసారికైతే పంపిస్తున్నా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కలగజేసుకున్న డ్రైవర్.. ‘‘చంద్రబాబుకే దిక్కులేదంటావా?’’ అని ప్రశ్నించాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఉద్యోగి ఈసారి ఏకంగా బూతులు అందుకున్నాడు.

ఈ మొత్తం ఘటనను తన సెల్‌లో రికార్డు చేసిన లారీ డ్రైవర్ మంత్రి అచ్చెన్నాయుడు, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంలకు దానిని పంపించి ఫిర్యాదు చేశాడు. చంద్రబాబును ఉద్యోగి తిడుతున్నప్పుడు పక్కనే రవాణాశాఖ అధికారి, సిబ్బంది ఉన్నా అతడిని వారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

విషయం మంత్రి దృష్టికి రావడంతో ఆయన కమిషనర్, డీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గురువారం ఈ ఘటనపై డీఎస్పీ సుబ్బారావుకు టీడీసీ ప్రతాప్ ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ సమయంలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎంవీఐ రవిశంకర్ నాయక్‌కు మెమో జారీ చేశారు. కాగా, పోలీసుల విచారణలో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగుచూశాయి. లారీ డ్రైవర్‌‌పై విరుచుపడి, సీఎంను దూషించిన వ్యక్తి అసలు ఉద్యోగే కాదని, మామూళ్ల వసూలు కోసం సిబ్బంది నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి అని తేలింది.

More Telugu News