Swiggy: స్విగ్గీ రైడర్‌పై 'సుబ్బయ్య గారి హోటల్' సిబ్బంది దాడి.. తీవ్ర ఉద్రిక్తత

  • సుబ్బయ్య హోటల్ ముందు ఆందోళన
  • తరలివచ్చిన వందలాది స్విగ్గీ రైడర్లు
  • లాఠీ చార్జీ చేసి చెదరగొట్టిన పోలీసులు

స్విగ్గీ రైడర్‌పై హైదరాబాద్‌, కేపీహెచ్బీ కాలనీలోని సుబ్బయ్య గారి హోటల్ సిబ్బంది దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల లాఠీ చార్జీ వరకు వెళ్లింది. ఈ నెల 21న మధ్యాహ్నం సుబ్బయ్య హోటల్‌కు ఓ ఆర్డర్ వచ్చింది. దానిని తీసుకెళ్లి డెలివరీ చేసేందుకు స్విగ్గీ రైడర్ రఘురెడ్డి హోటల్‌కు వెళ్లాడు. అయితే, ఎంతసేపటికీ ఆర్డర్ చేతికి అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ లోపు చేసిన ఆర్డర్‌ను కస్టమర్ రద్దు చేశాడు. దీంతో హోటల్ నుంచి బయటకు వస్తూ రఘుబాబు హోటల్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. గమనించిన హోటల్ సిబ్బంది హోటల్‌నే విమర్శిస్తావా? అంటూ అతడిపై దాడికి దిగారు.

రఘురెడ్డిపై దాడి విషయం తెలుసుకున్న స్విగ్గీ రైడర్లు వందలాదిమంది సుబ్బాయి హోటల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

More Telugu News