Telangana: రెబల్స్ ఎఫెక్ట్.. పడాల వెంకటస్వామి కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి కేఎస్ రత్నం!

  • సపోర్ట్ చేయాలని పడాలకు విజ్ఞప్తి
  • చేవెళ్లలో విజయానికి కృషి చేయాలని వినతి
  • పడాలకు మొండిచేయి చూపిన హైకమాండ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల నుంచి టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు రెబెల్స్ ను ప్రసన్నం చేసుకుంటున్నారు. అన్నా.. నాకు సపోర్ట్ చేయ్.. అంటూ వేడుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గంలో తనకే పార్టీ టికెట్ దక్కుతుందని పడాల వెంకటస్వామి ఆశించారు. అయితే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన కేఎస్ రత్నంకు హైకమాండ్ చేవెళ్ల టికెట్ ను కేటాయించింది.

ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని తొలుత పడాల వెంకటస్వామి నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించడంతో పోటీ నుంచి ఆయన విరమించుకున్నారు. పోటీ నుంచి తప్పుకున్న పడాల.. ఎన్నకల ప్రచారంలో పాల్గొనడం మానేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలుసుకున్న కేఎస్ రత్నం తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పడాల వెంకటస్వామి కాళ్లకు కేఎస్ రత్నం మొక్కారు. దీంతో ఆయన్ను పడాల లేపి కాళ్లపై పడొద్దని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.

More Telugu News