Karnataka: చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ.. బావ గొంతు కోసి కిరాతకంగా హతమార్చిన యువకుడు!

  • కర్ణాటకలోని బెంగళూరులో ఘటన
  • కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నో
  • పారిపోయి వివాహం చేసుకున్న జంట

పరువు కోసం పాకులాడిన ఓ యువకుడు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా తన చెల్లిని పెళ్లాడినందుకు ఆగ్రహించిన ఓ యువకుడు బావను కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది.

బెంగళూరు శివారులోని బిదలూరుకు చెందిన హరీశ్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లూరు గ్రామానికి చెందిన మీనాక్షి అనే యువతితో హరీశ్ కు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. హరీశ్ ది ఎస్టీ సామాజికవర్గం కాగా, యువతిది బీసీ సామాజికవర్గం. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో 8 నెలల క్రితం వీరిద్దరు ఇంటినుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు.

తాజాగా కొన్నిరోజుల క్రితం ఈ జంట నల్లూరుకు తిరిగివచ్చింది. అయితే కుటుంబ సభ్యులను కాదని మీనాక్షి వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని ఆమె సోదరుడు వినయ్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా బావ హరీశ్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మంచిమాటలు చెబుతూ బైక్ పై ఎక్కించుకుని ఊరి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో కిరాకతంగా గొంతు కోశాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ హరీశ్ ప్రాణాలు కోల్పోయేవరకూ అక్కడే ఉన్నాడు. అతను చనిపోయాడని నిర్ణయించుకుని ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. స్థానికులు రక్తపు మడుగులో పడిఉన్న యువకుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మీనాక్షి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News