serilingampalli: పట్టు వీడని మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌...మెట్టు దిగేది లేదని స్పష్టీకరణ

  • శేరిలింగంపల్లిలో స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతానని వెల్లడి
  • ఫలించని సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి బుజ్జగింపు
  • సీట్ల సర్దుబాటు అంశాన్ని గమనించాలని కోరినా పట్టించుకోని వైనం

హైదరాబాద్‌ నగరంలోని శేరిలింగంపల్లి నియోకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ తాను బరిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన భిక్షపతి, సీట్ల సర్దుబాటులో భాగంగా దీన్ని టీడీపీకి కేటాయించడంతో రెబల్‌గా నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి మంగళవారం భిక్షపతియాదవ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. సీట్ల సర్దుబాటు అంశాన్ని గమనించాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్న ఉద్దేశంతోనే మహాకూటమి ఏర్పాటైందని, కూటమి లక్ష్యాన్ని దెబ్బతీయవద్దని నచ్చజెప్పారు.

పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత పదవితో గౌరవిస్తుందని తెలిపారు. తనను పార్టీ పంపలేదని, పార్టీ నాయకుడిగా తానీ చొరవ తీసుకుని చెబుతున్నానని నచ్చజెప్పారు. అన్ని మాటలు సావధానంగా విన్న భిక్షపతియాదవ్‌ బయటకు వచ్చాక తాను మెట్టుదిగేది లేదని, పోటీ కొనసాగుతుందని స్పష్టం చేయడం గమనార్హం.

More Telugu News