Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లో చేతులు కలుపుతున్న పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్

  • కొత్త సంకీర్ణానికి ప్రయత్నాలు 
  • ఏకమవుతున్న వ్యతిరేక పక్షాలు
  • 2002 నుంచి 2007 వరకు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన మూడు పార్టీలు

జమ్ముకశ్మీర్ లో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ యేతర పార్టీలు ఏకమవుతున్నాయి. ఆ రాష్ట్రంలో కీలక పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లతో పాటు కాంగ్రెస్ ఒకే వేదికపైకి వస్తోంది. ఈ మేరకు మూడు పార్టీలకు సంబంధించిన విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో గవర్నర్ పాలన కొనసాగుతోంది. డిసెంబర్ 19న గవర్నర్ పాలన ముగియనుంది. దానిని మరింత పొడిగించే అవకాశం లేదు. పైగా రాష్ట్ర అసెంబ్లీ కూడా ఇంకా రద్దు కాలేదు. ఈ నేపథ్యంలో కొత్త సంకీర్ణానికి అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీఎఫ్ తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో... జూన్ 16న సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. దీంతో, ముఫ్తీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది. గతంలో 2002 నుంచి 2007 వరకు పీడీపీ, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. అప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఈ కూటమికి బయట నుంచి మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ల కూటమి ఏర్పాటు కష్టతరమైనది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News