Hyderabad: మరణంలోనూ వీడని ముగ్గురు యువకుల స్నేహబంధం!

  • హైదరాబాద్ మెట్టుగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం
  • వేగంగా వస్తూ పిల్లర్ ను ఢీకొన్న బైక్
  • ముగ్గురు యువకుల దుర్మరణం

ఉదయ్ కుమార్, పృథ్వీరాజ్, ఉదయ్ రెడ్డి... ఈ ముగ్గురు యువకులదీ ఒకే గ్రామం. చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగారు. అలానే పెరిగారు. వీరి తల్లిదండ్రులకు ముగ్గురూ ఏకైక సంతానమే. ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్న ఈ ముగ్గురూ మరణంలోనూ తమ స్నేహబంధాన్ని వీడకుండా, ఒకే ప్రమాదంలో మరణించడంతో మూడు కుటుంబాలూ విషాదంలో మునిగిపోయాయి.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తనకున్న ఓ ఇంటర్వ్యూ కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్న ఉదయ్ కుమార్, ఉప్పల్ లో ఉంటున్న ఉదయ్ రెడ్డి ఇంటికి రాగా, ఇద్దరు స్నేహితులూ కలిశారన్న విషయం తెలిసి, పృథ్వీరాజ్ పరుగున వారి వద్దకు వచ్చాడు. ముగ్గురూ కలసి ఒకే బైక్ పై రాత్రి 11.30 గంటల సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్లారు. రాత్రి 1.30 గంటల సమయంలో మెట్టుగూడ సమీపంలోని పిల్లర్ కు వారి వాహనం ఢీకొని, ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. అతివేగం, మద్యం తాగి ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News