Madhya Pradesh: ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి.. చెప్పుల దండేసి అవమానం

  • మధ్యప్రదేశ్‌లో ఘటన
  • ప్రజల ఆశీర్వాదం కోసం కిందికు వంగిన అభ్యర్థిపై చెప్పులదండ
  • పట్టుకుని చితకబాదిన అభ్యర్థి మద్దతుదారులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి మెడలో చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని నగడాలో జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం లభిస్తోంది. నగడా-ఖచురాద్ అసెంబ్లీ స్థానం నుంచి దిలీప్ సింగ్ షెఖావత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు నగడాలో చేదు అనుభవం ఎదురైంది.

ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కిందికు వంగిన సమయంలో ఓ వ్యక్తి ఆయన మెడలో చెప్పుల దండ వేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడిని షెఖావత్ మద్దతుదారులు పట్టుకుని దాడిచేశారు.

More Telugu News