Lawyers: ఓటుకు కోటి ఇస్తామని ఆఫర్.. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కలకలం

  • బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి భారీ డిమాండ్
  • ఓటేస్తే కోటి రూపాయలు ఇస్తామంటూ ఆఫర్
  • విచారణ జరిపించాలంటూ సీఎం కార్యాలయానికి లేఖ

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి ఓటు వేస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారంటూ న్యాయవాద వర్గాల్లో జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టించింది. ఈ ఆరోపణలపై విచారణ చేయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు కూడా అందాయి. తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఏపీ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగాయి. దాదాపు 24 వేల మంది న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొని 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ 25 మంది సభ్యులు కలిసి బార్ కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో కౌన్సిల్ చైర్మన్ పదవికి ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఓటుకు కోటి రూపాయల ఆఫర్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది.

బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఐదేళ్లపాటు విశేష అధికారాలుంటాయి. ఈ కారణంగా ఈ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ‘ఓటుకు కోటి’ ప్రచారం జోరందుకోవడంతో కొందరు సీఎం కార్యాలయానికి లేఖలు రాశారు. ఈ ఆరోపణలపై ఏసీబీతో విచారణ జరిపించాలని కోరారు.

More Telugu News