Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ఎంటర్ టైనర్ గా మారారు: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రాహుల్, అసదుద్దీన్ ‘భాయ్..భాయ్’ అనుకున్నారు!
  • అసదుద్దీన్ ప్రచారానికి వెళ్లకుండా ‘కాంగ్రెస్’ డబ్బు  
  • దీనిపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలు ‘భాయ్..భాయ్’ అనుకున్నారని, ఒవైసీ ఎన్నికల ఎంటర్ టైనర్ గా మారారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఒవైసీ ప్రచారానికి వెళ్లకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తానంటూ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన విషయమై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో మహాకూటమి ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.500 కోట్లు పంపిస్తున్నారని, ఆ డబ్బులో నుంచి ఒవైసీకి రూ.25  లక్షలు ఇస్తామని చెప్పి ఉంటారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పరిపాలనపై జీవీఎల్ విమర్శలు గుప్పించారు. ప్రజలు కేంద్రంగా కాకుండా, కుటుంబసభ్యులు కేంద్రంగా పరిపాలనలు సాగుతున్నాయని విమర్శించారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసినికి టికెట్ లభించడంపై ఆయన విమర్శలు చేశారు.

More Telugu News