bhuseva: ఏపీ వ్యాప్తంగా భూసేవ ప్రారంభం.. ప్రతి స్థలానికి ఆధార్ తరహాలో నెంబర్, క్యూఆర్ కోడ్ కేటాయింపు!

  • భూధార్ వెబ్ సైట్ ను ప్రారంభించిన చంద్రబాబు
  • వేలిముద్రల ఆధారంగానే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు
  • భూధార్ తీసుకురావం ఒక చరిత్ర అన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూసేవ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమరావతిలో భూధార్ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భూ లావాదేవీల్లో మోసాలను అరికట్టడానికి భూధార్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామని, మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇకపై వేలిముద్రల ఆధారంగానే భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఉంటాయని చెప్పారు.

ఆధార్ మాదిరే భూధార్ లో భూములకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. భార్య పేరిట ఉన్న భూమిని భర్త మోసం చేయడం కూడా ఇకపై కుదరదని చెప్పారు. ఒక వ్యక్తికి ఉన్న వేలిముద్రలు, కనురెప్పలు మరొకరికి ఉండవని... అందువల్ల మోసం చేయలేరని అన్నారు. ప్రతి భూమికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు. భూధార్ తో రెవెన్యూ శాఖకు మంచి పేరు రాబోతోందని చెప్పారు.

చుక్కల భూములపై 8వేల కేసులు ఉన్నాయని... నెలరోజుల్లో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. అవినీతి రహిత పాలనను అందించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూధార్ తీసుకురావడం ఒక చరిత్ర అని అన్నారు.

More Telugu News