Telangana: అభ్యర్థుల్లారా.. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు: సైబర్ క్రైం పోలీసుల హెచ్చరిక

  • సోషల్ మీడియా ప్రచారంలో సంయమనం పాటించాలని సూచన
  • ఐటీ చట్టాలను ఉల్లంఘించవద్దన్న పోలీసులు
  • మార్ఫింగ్, వ్యక్తిగత దూషణలకు మూడేళ్ల జైలు

తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, హద్దు మీరితే జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. అభ్యర్థులు ఐటీ చట్టానికి లోబడే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలని సూచించారు.

చాలామంది ప్రత్యర్థులపై బురద జల్లడానికి, విషం చిమ్మడానికి దానిని వేదికగా మార్చుకుంటున్నారని పేర్కొన్న పోలీసులు.. నిబంధనలను ఉల్లంఘించి కోరి కష్టాలు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ప్రత్యర్థుల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం నేరమన్నారు. ఐటీ చట్టం ప్రకారం ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెడితే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి సోషల్ మీడియా ప్రచారంలో సంయమనం పాటించాలని, లేనిపోని ఆవేశాలకు గురికావద్దని సైబర్ క్రైం పోలీసులు సూచించారు.

More Telugu News