Andhra Pradesh: అమరావతిలో తెలుగు తమ్ముళ్లు 25,000 ఎకరాలు కొన్నారు.. రూ.లక్ష కోట్లు కూడబెట్టారు!: బీజేపీ నేత జీవీఎల్

  • అమరావతి ఇప్పుడు స్విస్ బ్యాంకుగా మారింది
  • ఎకరాను కేవలం రూ.10 లక్షలకే కొన్నారు
  • విజయవాడ భూరక్ష దీక్షలో జీవీఎల్ వెల్లడి

లక్షల కోట్ల అవినీతి సంపాదన కోసమే అమరావతిని చంద్రబాబు నిర్మిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అమరావతి పేరుతో తెలుగు తమ్ముళ్లు ప్రజల భూములను, సొమ్మును దోచేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో ఎకరం భూమి రూ.4-5 కోట్లు పలుకుతుంటే, ఇక్కడ టీడీపీ నేతలు మాత్రం రూ.10 లక్షలకే దక్కించుకున్నారని భారీ కుంభకోణానికి తెరతీశారన్నారు. ఇలా 25,000 ఎకరాలను టీడీపీ నేతలు దక్కించుకున్నారన్నారు. విజయవాడలో ఈ రోజు జరిగిన భూ రక్షణ దీక్షలో జీవీఎల్ మాట్లాడారు.

ఇలా దాదాపు రూ.1,00,000 కోట్లను అమరావతిలో టీడీపీ నేతలు దాచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లకు అమరావతి స్విస్ బ్యాంకుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఏపీ ప్రజలు మేల్కోకుంటే అమరావతిని చూడటానికి చంద్రబాబు టికెట్ పెడతారనీ, ప్రజలు చెల్లించిన డబ్బుతో నిర్మాణాలు చేపడతారని పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ అంటే తెగ దోచేసే ప్రభుత్వంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు ఏంటని ప్రశ్నించారు.

More Telugu News