Telangana: వేములవాడలో కాంగ్రెస్ పార్టీకి ఝులక్.. టీఆర్ఎస్ లో చేరిన ఏనుగు మనోహర్ రెడ్డి!

  • కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన
  • నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదని వెల్లడి
  • వేములవాడ అభివృద్ధి కోసం పనిచేస్తానన్న మనోహర్

తెలంగాణలోని వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు టీఆర్ఎస్ లో చేరారు. గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినా ఎలాంటి గుర్తింపు లభించలేదని ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఓసారి టికెట్ ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేశాననీ, ఈసారి కూడా తనకు అన్యాయం చేశారని వాపోయారు.

కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగే పరిస్థితులు లేవని మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థి దశ నుంచి గత 25 ఏళ్లుగా పార్టీకి అవిశ్రాంతంగా సేవ చేసినా తనను పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్ బాబుతో కలిసి నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రకటించారు.

More Telugu News