Andhra Pradesh: సంచలన నిర్ణయాలు తీసుకుని ‘చంద్రం ఎఫెక్ట్’ చూపనున్న చంద్రబాబు!: విజయసాయిరెడ్డి సెటైర్

  • బాబుపై రోగాలన్నీ ఒకేసారి దాడిచేశాయి
  • ఎవరైనా ఆయన్ను డాక్టర్ కు చూపించండి
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మానసిక రోగాలన్నీ ఒకేసారి దాడి చేసినట్లు ఉన్నాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మానసికంగా బ్యాలెన్స్ కోల్పోయారనీ, ఎవరైనా ఆయన్ను వైద్యులకు చూపించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓవైపు కేంద్రం పరిధిలోని స్థలంలో జగన్ పై హత్యాయత్నం జరిగిందన్న సీఎం, మరోవైపు రాష్ట్రంలో సీబీఐని అడుగుపెట్టనివ్వబోమని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

పెద్ద నోట్లను రద్దుచేసి ప్రధాని మోదీ భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినందున ఏపీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు బాబు సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగా ‘మా నోట్లను మేమే ముద్రించుకుంటాం. మా మిలటరీని మేమే ఏర్పాటు చేసుకుంటాం. మా రైళ్లు, విమానాలను మేమే నడుపుకుంటాం. 2050 వరకూ ఎన్నికలు అవసరం లేకుండా ఓ జీవో ఇచ్చేస్తాం. ప్రతి ఐదేళ్లకు ఎన్నికలతో అభివృద్ధి నిలిచిపోతోంది’ అని చంద్రబాబు భావిస్తున్నారని పేర్కొన్నారు. దీన్నే చంద్రం ఎఫెక్ట్ అంటారని ఎద్దేవా చేశారు.

More Telugu News