Jagan: ఈ ఒక్క పని చేస్తే ప్రజల్లో జగన్ కొండంత ఎత్తునకు ఎదుగుతాడు: మాజీ ఎంపీ సబ్బం హరి సలహా

  • వైసీపీ బలం, బలహీనతా ఆయనే
  • విమానాశ్రయం దాడి టీడీపీ పని అనడం అసంబద్ధం
  • కోడికత్తిని వదిలేస్తే జగన్ కు ఎంతో మేలు
  • మాజీ ఎంపీ సబ్బం హరి సలహా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత రెండూ వైఎస్ జగనేనని, రాష్ట్రంలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారంటే, అది జగన్ మాత్రమేనని పార్లమెంట్ మాజీ సభ్యుడు సబ్బం హరి వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి విషయం చాలా చిన్నదని, ఈ దాడిపై ప్రజలు ఓ అంచనాకు వచ్చేసున్నారని, ఈ ఘటనపై మరింతగా రాజకీయాలు చేయకుండా వదిలేసి... 'ఎవడో పిచ్చోడు చేశాడులే' అంటూ కేసును కూడా వదిలేస్తే, ప్రజల్లో జగన్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తునకు ఎదుగుతుందని అన్నారు.

అలా చేయకుండా ఈ ఘటనను రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలని జగన్, మూడు మెట్లెక్కితే, చంద్రబాబు ఆరు మెట్లెక్కుతారని, ఈ గొడవ ఇక్కడితో ఆగిపోతే మంచిదని సలహా ఇచ్చారు. తన హత్య కోసం చంద్రబాబు కుట్ర పన్నారని జగన్ ఆరోపించడం అసంబద్ధమని ఆయన అన్నారు. "పైన దేవుడనే వాడు ఉన్నాడు.. అతను అక్కడి నుంచి అన్నీ చూస్తున్నాడు" అని జగన్ అనే మాటలు వాస్తవమే అయితే, శ్రీనివాసరావు తల్లిదండ్రుల రోదన చూసి, కేసు లేకుండా వదిలేయాలని సూచించారు.

More Telugu News