Road Accident: మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం.. నలుగురి ప్రాణాలు కాపాడిన సీటు బెల్టులు!

  • కారుకు సడన్ బ్రేక్ వేయడంతో పల్టీలు
  • సీటు బెల్టులు ధరించడంతో తప్పిన ప్రమాదం
  • స్వల్ప గాయాలతో బయటపడిన వైనం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని మంగళగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అయితే, అదృష్టవశాత్తు కారులోని అందరూ సీటు బెల్టులు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం డైరెక్టర్ కె.రాజశేఖర్.. భార్య కోటేశ్వరి, శివరంజని, పదేళ్ల సాయి రోహిత్‌తో కలిసి ఒంగోలులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి కారులో విజయవాడకు వస్తుండగా మంగళగిరి వద్ద వారి వాహనానికి ఎదురుగా మరో వాహనం దూసుకొచ్చింది. దీంతో కారుకు సడన్ బ్రేకు వేయడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అయితే, కారులోని వారు సీటు బెల్టులు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

More Telugu News