Telangana: ఓ కులం యువతను పవన్ కల్యాణ్ రెచ్చగొడుతున్నారు.. వెంట తిప్పుకుంటూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు!: వైపీసీ నేత సుధాకర్ బాబు

  • జగన్ పై పవన్ వ్యాఖ్యలు బాధాకరం
  • చంద్రబాబు ఎంతిచ్చారో జనసేనాని చెప్పాలి
  • పవన్ కు క్యారెక్టర్ లేదని జనాలు చెప్పుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. జగన్ కులం గురించి ప్రస్తావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతాడో పవన్ కల్యాణ్ కే తెలియదని ఎద్దేవా చేశారు. పవన్ ఎప్పుడేం చేస్తాడో ఇంట్లోవాళ్లకు కూడా అర్థం కాదని వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు నాలుగేళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ ఇప్పుడు నిద్రలేచి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారని సుధాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల సందర్భంగా గుడ్డలు చించుకుంటూ ఆవేశంతో ప్రసంగాలు ఇచ్చిన పవన్ కల్యాణ్ ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి బేషరతుగా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అధికారంలో ఉన్న టీడీపీని ప్రశ్నించాల్సింది పోయి, నిరంతరం ప్రజలలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్‌ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ తన పార్టీని చంద్రబాబుకు గంపగుత్తగా లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం రియల్టర్ లింగమనేని మధ్యవర్తిత్వం ద్వారా పవన్ మూటలు అందుకున్నారని తెలిపారు.

టీడీపీ ఎలా చెబితే అలా ఆడుతున్న పవన్ కల్యాణ్ కు క్యారెక్టర్ లేదని ప్రజలు చెప్పుకుంటున్నారని సుధాకర్ బాబు అన్నారు. పవన్ ఓ సామాజికవర్గానికి చెందిన యువతను రెచ్చగొడుతూ, తన వెంట తిప్పుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. పచ్చ మీడియా చెబుతున్న కోడికత్తి డ్రామా పదాలను పవన్ పలకడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇడుపులపాయ ఎస్టేట్ లో అసైన్డ్‌ భూములు ఉన్నాయని పవన్‌ ఆరోపించడం దారుణమన్నారు. తమ భూముల్లో అసైన్డ్ భూములను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ వాటిని వెనక్కు అప్పగించిన ఘటనను ఆయన గుర్తుచేశారు.

More Telugu News