Anantapur District: రైలు కింద చిక్కుకున్నా ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికుడు.. వీడియో వైరల్!

  • పట్టాలు దాటుతుండగా ఘటన
  • ఒక్కసారిగా కదిలిన గూడ్సు రైలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆయుష్షు గట్టిదైతే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. రైలు పట్టాలు దాటేందుకు గూడ్సు రైలు కింద సదరు వ్యక్తి దూరగానే రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో అతను రైలు కింద చిక్కుకుపోయాడు. చివరికి సురక్షితంగా బయటపడ్డాడు.

లక్నో నుంచి యశ్వంతపూర్ కు వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు అనంతపురం రైల్వేస్టేషన్ లో ఆగింది. దీంతో రైలు నుంచి దిగిన ఓ వ్యక్తి వేరే ప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు పట్టాలపైకి దిగాడు. పక్కనే గూడ్సు రైలు ఆగిఉండటంతో దాని కింద నుంచి దూరి అవతలి వైపునకు పోయేందుకు యత్నించాడు. అయితే అంతలోనే గూడ్సు రైలు కదలడంతో పాటు వేగం పుంజుకుంది. ఈ ఘటనలో రైలు కింద చిక్కుకున్న యువకుడు కదలకుండా పడుకుండిపోయాడు.

చివరికి రైలు వెళ్లిన తర్వాత ఎలాంటి గాయాలు కాకుండా అతను లేచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని ప్లాట్ ఫామ్ పై ఉన్న ఓ వ్యక్తి ఫోన్ లో చిత్రీకరించి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News