Jammu And Kashmir: ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపిన బలగాలు.. ప్రతీకారంగా యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు!

  • జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ లో ఘటన
  • తెల్లవారుజామున మొదలైన ఆపరేషన్
  • ఎదురుకాల్పుల్లో అల్ బదర్ ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు ఈ రోజు ఉగ్రవాదులను చావుదెబ్బ తీశాయి. చలికాలం మొదలుకాకముందు భారత్ లోకి చొరబడి విధ్వంసానికి ప్రణాళిక రచించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమర్చాయి. షోపియాన్ జిల్లాలోని రెబ్బన్ ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిని మట్టుబెట్టాయి.

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి షోపియాన్ జిల్లాలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు ఈ రోజు ఉదయాన్నే రెబ్బన్ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. బలగాల కదలికలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు వీరిపై ఎదురుకాల్పులు జరిపాయి.

ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. చనిపోయిన ఉగ్రవాదులు అల్ బదర్ గ్రూపునకు చెందినవారని తెలిపారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు పోలీసులకు సహకరిస్తున్నారని ఇప్పటికే ఐదుగురు యువకులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు తాజాగా మరో యువకుడిని ఎత్తుకెళ్లారు.

More Telugu News