YSRCP: నోరు జారిన వైసీపీ నేతలు ... జ్యోతుల నెహ్రూకు జైకొట్టి నాలిక కరుచుకున్న వైనం!

  • జగ్గంపేట బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో ఘటన
  • నెహ్రూను గెలిపించాలని కోరిన వైవీసుబ్బారెడ్డి, అనంతకుమార్‌
  • పొరపాటని చెప్పడంతో చంటిబాబు పేరు ప్రస్తావన

అలవాటులో పొరపాటు అంటే ఇదేనేమో...ఒకప్పుడు తమ పార్టీ నాయకుడు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా, ఆ విషయం మర్చిపోయి... అతనికే జై కొట్టడంతో ఆశ్చర్యపోవడం కార్యకర్తల వంతయింది. జగ్గంపేటలో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జగ్గంపేట పార్టీ కన్వీనర్‌ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జరిగిన బూత్‌ కమిటీ సమావేశానికి వైసీపీ రాష్ట్ర నాయకుడు వై.వి.సుబ్బారెడ్డి హాజరయ్యారు.

ఈ సభలో వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలంటే జ్యోతుల నెహ్రూను గెలిపించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన యువ నాయకుడు అనంతబాబు కూడా ఇదే విధంగా మాట్లాడడంతో కంగుతినడం బూత్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తల వంతయింది. సభా వేదికపై ఉన్నవారు కూడా అవాక్కయ్యారు. నిర్వాహకులు విషయం వారికి తెలియజేయడంతో సర్దుకుని జ్యోతుల చంటిబాబు పేరు చెప్పారు. సుబ్బారెడ్డితోపాటు, జిల్లా యువ నాయకుడు కూడా జ్యోతుల నెహ్రూ పేరు ప్రస్తావించడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

More Telugu News