Andhra Pradesh: చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి!: సీపీఐ నేత రామకృష్ణ

  • జగన్ పై దాడిలో నిందితుల్ని బయటపెట్టాలి
  • చింతమనేనిని ఇంకా ఉపేక్షించడం దారుణం
  • అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఆమరణ నిరాహార దీక్ష

తెలుగుదేశం నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీలో ఆయన ఆగడాలు మితిమీరుతున్నాయని విమర్శించారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులు, అధికారులపై చింతమనేని దాడి చేస్తుంటే చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. చింతమనేని ప్రభాకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని లేదంటే విజయవాడలో ఈ నెల 23న మిగతా వామపక్ష పార్టీలతో కలిసి ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితుల వివరాలను బహిర్గతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోకపోతే డిసెంబర్ 2 నుంచి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.  

More Telugu News