Bhadradri Kothagudem District: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాగాలు...వైరాలోనూ రాజీనామాల పర్వం

  • పార్టీ అభ్యర్థిని వ్యతిరేకిస్తూ పలువురి రాజీనామా
  • అభ్యర్థిని మార్చమని కోరినా అధిష్ఠానం పట్టించుకోలేదని నిరసన
  • స్వతంత్ర అభ్యర్థి తరపున పనిచేస్తామని స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్‌లో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. నిన్న అశ్వారావుపేటలో...తాజాగా వైరాలో మూకుమ్మడి రాజీనామాలు ఆ పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. వైరా నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా భానోతు మదన్‌లాల్‌ ఎంపికను నిరసిస్తూ ఎంపీ వర్గీయులైన అసమ్మతి నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆశ్వారావుపేట నియోజకవర్గం పార్టీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు తీరును నిరసిస్తూ పార్టీ ఎంపీపీ బాలూనాయక్‌, ఆయన అనుచరులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరి బాటలోనే వైరా నాయకులు ప్రయాణిస్తున్నారు.

జూరుపాడు యల్లంకి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజీనామా అంశాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు లేళ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ ఇన్నాళ్లు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలని కోరినా అధిష్ఠానం పట్టించుకోలేదన్నారు. అధినాయకత్వం తీరును నిరసిస్తూ రాజీనామాలు చేసినట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థికి తాము మద్దతు ఇస్తామని, మదన్‌లాల్‌ను ఓడించి తీరుతామని స్పష్టంచేశారు.

More Telugu News