Hizbul Mujahideen: ఇన్ఫార్మర్ నెపంతో 16 ఏళ్ల కుర్రాడిని దారుణంగా కాల్చి చంపిన హిజ్బుల్

  • చీకటి గదిలో బంధించి కాల్పులు
  • తలపై 20 రౌండ్లు కాల్చి చంపిన ఉగ్రవాదులు
  • తీవంగ్రా ఖండించిన ఒమర్ అబ్దుల్లా

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) ఐసిస్ స్టైల్లో దారుణానికి పాల్పడింది. ఇన్ఫార్మర్ నెపంతో పదకొండో తరగతి చదువుతున్న 16 ఏళ్ల కశ్మీరీ యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చింది. కశ్మీర్‌కు చెందిన హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

కశ్మీరీ మాట్లాడుతున్న ఉగ్రవాదులు బాలుడి తలలోకి 20 సార్లు కాల్చి అత్యంత దారుణంగా హతమార్చారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు ఎంతమాత్రమూ సమర్థనీయం కాదన్నారు. ఉగ్రవాద సానుభూతిపరులు ఇటువంటి ఘటనపై ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

సోఫియాన్‌లోని సఫ్నాగ్రికి చెందిన నదీం మంజూర్ (18)ను గురువారం రాత్రి అపహరించిన హిజ్బుల్ ఉగ్రవాదులు ఓ చీకటి గదిలో అతడిని బంధించారు. అనంతరం అతడి తలపై 20 సార్లు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. శుక్రవారం నదీమ్ మృతదేహం పుల్వామాలోని నిక్లోరా గ్రామంలో లభ్యమైంది.

More Telugu News