Chandrababu: పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు.. తన మనవడిని కూడా తీసుకుపోతాడు: జగన్ ఎద్దేవా

  • పోలవరాన్ని లంచాల మయం చేశాడు
  • సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు
  • యనమలగారి వియ్యంకుడే సబ్ కాంట్రాక్టర్
  • నాలుగున్నరేళ్లలో పునాది గోడే కట్టారు

పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్కరే పోరని.. ఆయన మనవడిని కూడా తీసుకుని పోతారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. నేడు పార్వతీపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మాట మాట్లాడితే పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చానని చంద్రబాబు అంటారు. పట్టిసీమ నుంచి తెచ్చిన నీళ్లు ఏమయ్యాయని అడుగుతున్నా. కరువుతో రైతులు అల్లాడుతుంటే కనిపించడం లేదా? అని అడుగుతున్నా. రాష్ట్రానికి వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు పరిస్థితి ఒకసారి గమనించమని అడుగుతున్నా. నాలుగున్నరేళ్ల పాలనలో పునాది గోడ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్టుగా పోజులిస్తాడు. ఆ ప్రాజెక్టుకు ఆయన పోవడమే కాదు.. ఆయన మనవడిని కూడా తీసుకునిపోతాడు.

ప్రతి సోమవారం పోలవరం అంటాడు.. ఎక్కడన్నా కనిపించాడా? అని ప్రశ్నిస్తున్నా. పోలవరం ప్రాజెక్టును లంచాలమయం చేశాడు. పోలవరం పనుల రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచేశాడు. ఇష్టం వచ్చినట్టుగా సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరంటే.. తన కేబినెట్‌లోని మంత్రి యనమలగారి వియ్యంకుడు. అంత దారుణంగా పోలవరాన్ని దోచేస్తూ నత్తనడకన సాగిస్తున్నారు. ఎన్నికలొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడుగారికి ప్రజలను మోసం ఎలా చేయాలి అన్న ఆలోచనలొస్తాయి. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం.

నాలుగున్నరేళ్ల కాలంలో గుర్తుకు రాలేదు. ఇదే సుజల స్రవంతిని అప్పట్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు పోలవరం కుడికాలువలో 90శాతం పనులు పూర్తి చేసి.. ఎడమ కాలువలో దాదాపు 70శాతం పనులు పూర్తి చేశారు. 184కి.మీ ఎడమ కాలువలో 135కి.మీ వైఎస్ఆర్ గారి హయాంలోనే పూర్తైతే.. ఆ మిగిలిపోయిన 49 కి.మీ కూడా పూర్తి చేయలేని అన్యాయమైన పాలన చంద్రబాబుగారు చేస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఉండగా ఇప్పుడొచ్చి మళ్లీ సుజల స్రవంతికి టెంకాయ్ కొట్టాలని చూస్తాడు’’ అంటూ జగన్ మండిపడ్డారు.

More Telugu News