Telangana: నందమూరి సుహాసిని పోటీ చేయడంపై ట్విట్టర్ లో స్పందించిన నారా లోకేశ్!

  • ఎన్టీఆర్ ను తెలంగాణ ప్రజలు గుండెలకు హత్తుకున్నారు
  • ఆయన తెలంగాణలో అమరుడయ్యారు
  • ప్రజాసేవ చేసేందుకు సుహాసిని ముందుకొచ్చారు

పేదల పెన్నిధిగా, బడుగుబలహీన వర్గాలకు ఆత్మీయుడిగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారకరామారావును తెలంగాణ ప్రజలు గుండెలకు హత్తుకున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణ గడ్డపై పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఇదే గడ్డపై అమరుడయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ సైతం తెలంగాణలోనే తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్, హరికృష్ణల వారసురాలు నందమూరి సుహాసిని ఈ రోజు ప్రజా సేవ చేసేందుకు ముందుకొచ్చారని లోకేశ్ తెలిపారు. తాతగారి ఆశయాలతో, తండ్రి ఆకాంక్షలతో,మావయ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో వస్తున్న ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించాలని కూకట్ పల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుహాసిని విజయమే ఎన్టీఆర్, హరికృష్ణలకు అందించే అసలైన నివాళి అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.

More Telugu News