USA: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య.. వెనుక నుంచి కాల్చి పరారైన యువకులు!

  • టెన్నెసీలోని వెంట్ నగర్ లో ఘటన
  • యడ్ల సునీల్ పై కాల్పులు జరిపి పరారీ
  • నిందితుల్ని పట్టుకున్న పోలీసులు

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి టెన్నెసీ రాష్ట్రంలోని నాష్ విల్లే వెంట్ నర్ ప్రాంతంలో ఉంటున్న తెలుగు వ్యక్తి యడ్ల సునీల్ ను ఇద్దరు మైనర్లు తుపాకీతో కాల్చిచంపారు. తన మనవడితో కలిసి ఇంటి బయటకు వస్తున్న సునీల్ పై కాల్పులు జరిపిన దుండుగులు ఆయన కారును దొంగలించారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కుటుంబ సభ్యులు సునీల్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.

యడ్ల సునీల్ బంధువులు పశ్చిమగోదావరితో పాటు మెదక్ జిల్లాలో కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంటాడి దారిలోనే అరెస్ట్ చేశారు. అమెరికాతో పాటు మెదక్ చర్చిలో పాటలు పాడటం ద్వారా సునీల్ పలువురికి సుపరిచితులు. కాగా, ఈ దాడి దోపిడీ కోసం జరిగిందా? లేక జాతి విద్వేష నేరమా? అన్నది ఇంకా తెలియరాలేదు.

ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సునీల్ వెనుకవైపు నుంచి కాల్పులు జరిపిన నిందితులు కారుతో ఘటనాస్థలం నుంచి పరారయ్యారని వెల్లడించారు. తన తల్లి 95వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27న భారత్ కు రావడానికి సునీల్ ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సునీల్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

More Telugu News