dhoni: విశాఖపై ధోనీ ప్రేమ.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం!

  • విశాఖలో క్రికెట్ అకాడమీని స్థాపిస్తున్న ధోనీ
  • రూ. 60 కోట్ల వ్యయంతో భారీ అకాడమీ నిర్మాణం
  • ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్

క్రికెటర్ గా తన ప్రస్థానాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లిన విశాఖపట్నంపై ధోనికి ఉన్న ప్రేమ అంతా ఇంతాకాదు. ఈ నేపథ్యంలో, విశాఖ సాగర తీరంలో రూ. 60 కోట్ల వ్యయంతో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీని ఆయన నెలకొల్పబోతున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా సమక్షంలో ప్రభుత్వ అధికారులతో ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో అకాడమీతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ క్రికెట్ అకాడమీలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకూ ఉపయోగకరంగా ఉండేలా 24 మైదానాలు (ఇండోర్, ఔట్ డోర్)లను నిర్మించనున్నారు. ఈ అకాడమీతో ఏపీ క్రీడా ముఖచిత్రంలో సమూల మార్పులు సంభవిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన పలు వివరాలను ఆర్కా స్పోర్ట్ త్వరలోనే వెల్లడించనుంది.

టీమిండియాకు ధోనీ ఎంపికైన తర్వాత తొలి సిరీస్ ను బంగ్లాదేశ్ తో ఆడాడు. తొలి వన్డేలో సున్నా పరుగులకే రనౌట్ అయ్యాడు. మొత్తం మీద ఆ సిరీస్ ధోనీకి ఏమాత్రం కలసి రాలేదు. రెండో సిరీస్ ను పాకిస్థాన్ తో ఆడాడు. ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యమిచ్చింది. ఆ మ్యాచ్ లో 123 బంతుల్లో 148 పరుగులు చేసి సత్తా చాటాడు ధోనీ. అక్కడి నుంచి ధోనీ వెనుదిరిగి చూసుకోలేదు. అందుకే తనకు బ్రేక్ ఇచ్చిన విశాఖ అంటే ధోనీకి అమితమైన ప్రేమ.

More Telugu News