Sandeep setty: హెల్మెట్ పెట్టుకోనందుకు క్షమించండి.. ఓ వ్యక్తిని పొడిచేసి వస్తున్నా!: వాహనదారుడి సమాధానంతో షాకైన పోలీసులు

  • సందీప్ నుంచి రూ.లక్ష తీసుకున్న దేవరాజ్
  • నమ్మించి సందీప్‌ని మోసం చేశాడు
  • దేవరాజ్‌ను కత్తితో పొడిచిన సందీప్

ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా వస్తున్నాడని ఆపితే ఆ యువకుడు చెప్పిన సమాధానంతో పోలీసులు షాక్ అయ్యారు. అసలు విషయంలోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన సందీప్ శెట్టి(26), దేవరాజ్ ఇద్దరూ వ్యాపార భాగస్వాములు. 2016లో దేవరాజ్.. లక్ష రూపాయలు సందీప్ దగ్గర నుంచి తీసుకున్నాడు. అయితే ఆ డబ్బుతో భూమి కొంటున్నానని.. దానిని అమ్మిన వెంటనే డబ్బు తిరిగిచ్చేస్తానని నమ్మబలికాడు. కానీ ఇప్పటి వరకూ భూమిని దేవరాజ్ కొనలేదు. దీంతో డబ్బు విషయమై వీరిద్దరి మధ్య ఏడాదిగా గొడవ జరుగుతోంది.

ఎంతకీ తన డబ్బు తిరిగివ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో దేవరాజ్‌ను కత్తితో పొడిచాడు. అనంతరం సందీప్ లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా.. చిక్‌బళ్లాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. హెల్మెట్ లేదేమిటని అడిగితే తను దేవరాజ్‌ను పొడిచి వస్తున్నానని.. లొంగిపోయేందుకు స్టేషన్‌కు వెళుతున్నానని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. హెల్మెట్ పెట్టుకోనందుకు క్షమించాలని సందీప్ పోలీసులను వేడుకోవడం విశేషం. ప్రస్తుతం దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News