Chandrababu: చంద్రబాబుకి, రాష్ట్ర నాయకత్వానికి మేమెందుకు కనిపించడంలేదో!: కన్నీరు పెట్టిన టీడీపీ నేత శోభారాణి

  • పదిహేనేళ్ల పాటు పార్టీ కోసం పని చేశా
  • కాపలా కుక్కల్లా పార్టీ కోసం పని చేసినా ఫలితం లేదు
  • నా జీవితాన్ని కోల్పోయాను

ఆలేరు నియోజకవర్గం టికెట్ తనకు వస్తుందన్న ఆశలు అడియాశలు కావడంతో టీడీపీ నాయకురాలు బండ్రు శోభారాణి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, పదిహేనేళ్ల పాటు పార్టీ కోసం పని చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, తన జీవితాన్ని కోల్పోయానని కన్నీరు మున్నీరయ్యారు. టీడీపీ కష్ట కాలంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, ఎన్నో ఉద్యమాలు చేశామని చెప్పారు. పార్టీ వైపు కన్నెత్తి చూడని పరిస్థితుల్లో కూడా కాపలా కుక్కల్లా పార్టీ కోసం తాము పని చేశామని, మరి, చంద్రబాబునాయుడుకి, రాష్ట్ర నాయకత్వానికి తామెందుకు కనిపించడంలేదో అర్థం కావట్లేదని అన్నారు.

‘మా లైఫ్ అంతా ఇక్కడే పోయింది. మా కుటుంబాలన్నీ నాశనమైపోయాయి. ఆస్తులు అమ్ముకున్నాం.. చాలా ఇబ్బందులు పడ్డాం. పార్టీ మమ్మల్ని ఇలా ఎందుకు అన్యాయం చేసిందో తెలవట్లేదు. కుటుంబాన్ని పక్కనబెట్టి.. చిన్న పిల్లలను వదిలేసి.. ఇదే (టీడీపీ) నా కుటుంబం అనుకుని పనిచేశాను నేను’ అంటూ బోరున విలపించారు.

‘2004లో టీఆర్ఎస్ లో నాకు టికెట్ రాలేదు. ఆరోజున ఆవేదన వ్యక్తం చేశా. చంద్రబాబునాయుడు పిలుపును అందుకుని ఆరోజున టీడీపీలో చేరాను. ఈరోజున ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి వరకు టికెట్ వస్తుందని మభ్యపెట్టారు. రాష్ట్ర నాయకత్వమంతా కూడా ‘నీ టికెట్ నీకిస్తున్నాం’ అని చెప్పారు. చివరకు, చాలా అన్యాయం జరిగిపోయింది’ అని శోభారాణి వాపోయారు.

More Telugu News