Andhra Pradesh: చిన్నారి చేతిపై పెన్సిల్ తో గుచ్చిన సైకో టీచర్.. ఆపరేషన్ చేయాలంటున్న వైద్యులు!

  • అనంతపురంలోని సాయినగర్ లో ఘటన
  • కేశవరెడ్డి పాఠశాలలో టీచర్ రాక్షసత్వం
  • ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ రాక్షసురాలిగా మారింది. హోంవర్క్ చేయలేదన్న కోపంతో విద్యార్థి చేతిపై పెన్సిల్ తో పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ రోజు చోటుచేసుకుంది.

అనంతపురంలోని సాయినగర్ లో ఉంటున్న కేశవరెడ్డి పాఠశాలలో హరిచరణ్ తేజ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. టీచర్ ఇచ్చిన హోంవర్క్ ను చేయకుండా తేజ్ ఈ రోజు క్లాస్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా హోంవర్క్ లను పరిశీలించిన టీచర్ ఆగ్రహంతో ఊగిపోయింది. ‘హోంవర్క్ ఇస్తే చేయకుండా స్కూలుకు వస్తావా?’ అంటూ పెన్సిల్ తో చేతిపై గట్టిగా పొడిచింది. ఈ ఘటనలో పెన్సిల్ ఓవైపు నుంచి చేతిలోకి దూసుకెళ్లి మరోవైపు నుంచి బయటకు వచ్చింది.

దీంతో బాలుడిని స్థానికంగా ఉన్న ప్రియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. బాలుడి కుడి చేతికి లోతుగా గాయమయిందని తెలిపారు. చేతిలో గుచ్చుకున్న రెండు పెన్సిల్ ముక్కలను ఇప్పటికే తొలగించామన్నారు. ఈ చేతికి మరోసారి ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తేజ్ గాయపడటానికి కారణమైన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూలు ముందు ఆందోళనకు దిగాయి.

More Telugu News