Andhra Pradesh: సీబీఐకి ‘సమ్మతి’ ఉత్తర్వుల రద్దు.. స్పందించిన హోంమంత్రి చినరాజప్ప!

  • సీబీఐలో కుమ్ములాటలు ముదిరాయి
  • మేధావుల సలహా మేరకే రద్దు నిర్ణయం
  • విచారణకు ముందస్తు అనుమతి తప్పనిసరి

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై ఇటీవల వచ్చిన అభియోగాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలోనే ఆ సంస్థకు ఇచ్చిన ‘సమ్మతి’ ఉత్తర్వులను రద్దు చేశామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ విషయంలో పలువురు మేధావుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నామని చెప్పారు.

ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఏ కేసు విచారణలో అయినా సీబీఐ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సీబీఐకి సమ్మతి ఉత్తర్వులు రద్దు చేశాయని చినరాజప్ప తెలిపారు. సీబీఐపై తమకు ఇప్పటికీ విశ్వాసం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నామన్న వాదనలను ఆయన ఖండించారు. సీబీఐ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓ ఆయుధంగా మారిపోయిందని హోంమంత్రి దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే సంబంధిత కేసుల్లో సీబీఐ విచారణ చేపట్టాల్సి ఉంటుంది.

More Telugu News