Sivaji: జగన్ కు హాని కలిగేది విజయసాయి వల్లే: నటుడు శివాజీ వ్యాఖ్యల వీడియో!

  • ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శివాజీ
  • ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూకు హాజరైన శివాజీ
  • తప్పు చేసిన వారు తప్పించుకోలేరని వెల్లడి
  • కేసులు తేలిన తరువాత రాజకీయాల్లోకి రావాలని సలహా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ప్రాణహాని ఏదైనా ఉంటే, అది ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి నుంచేనని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన, ఓ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్నారు. 'ఆపరేషన్ గరుడ'పై తాను విడుదల చేసిన వీడియోలో జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

విజయసాయివల్లే జగన్ కు థ్రెట్ ఉందని, ఆయన తమబోటి వారి గురించి నోరు పారేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తాను ఎవరినీ దొంగ అని అనలేదని, నిందితుడని మాత్రమే చెబుతున్నానని స్పష్టం చేసిన ఆయన, రాజ్యాంగంపై నమ్మకమున్న వారైతే, వారిపై ఉన్న కేసులు నిర్వీర్యం అయిపోయిన తరువాత, కొట్టేసిన తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడగాలని సలహా ఇచ్చారు.

"డియర్ రెడ్డి గారూ... మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఉంటే విచారణ ఏజన్సీలు నన్ను పిలుస్తాయి. మీరు అడగక్కర్లా. తప్పు చేసిన వాడు ఎన్నటికీ తప్పించుకోలేరు. ఎంత ఇల్లెక్కి అరిచినా కూడా... తప్పు చేసిన వాడు ప్రజల నుంచి ప్రజాస్వామ్యం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేడు. ఇది నేను నమ్ముతా. మీరూ నమ్మి రాజకీయాలు చేయండి" అని ఆయన అన్నారు.

తాను ఓ సామాన్యుడినని, తనను అసామాన్యుడిగా చేస్తున్నది వైకాపా వారేనని, తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగుతున్నారని శివాజీ ఆరోపించారు. తాను విడుదల చేసిన 52 నిమిషాల వీడియోలో ఎక్కడా జగన్ గురించి గానీ, రాజకీయ పార్టీల గురించిగానీ, పవన్ గురించిగానీ తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు.

More Telugu News