Andhra Pradesh: మేం ప్రేమించడానికి రెడీగా ఉన్నాం.. కానీ చంద్రబాబే అందుకు సిద్ధంగా లేరు!: మంత్రి కేటీఆర్

  • పిడమర్తి రవిని భారీ మెజారిటీతో గెలిపించండి
  • సండ్రకు ఓటేస్తే సీతారామా ప్రాజెక్టు ఆగిపోయినట్లే
  • కూటమి సీట్లు పంచుకునే లోపే మనం స్వీట్లు పంచుకుందాం

సత్తుపల్లిలో మహాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు ఓటు వేస్తే సీతారామా ప్రాజెక్టు ఆగిపోయినట్లేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. మహాకూటమికి ఓటు వేస్తే గోదావరి జలాలను సత్తుపల్లికి తీసుకురావాలన్న లక్ష్యం కలగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. పొరుగువారిని ప్రేమించాలని కొందరు పెద్దలు చెప్పారనీ, అందుకు తాము సిద్ధంగా ఉన్నా పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు మాత్రం సిద్ధంగా లేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని సత్తుపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మహాకూటమికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సీట్లు ఇవ్వొచ్చనీ, చంద్రబాబు కట్టలుకట్టలు నోట్లు ఇవ్వొచ్చని.. అయితే ఓట్లు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలేనని కేటీఆర్ సెటైర్ వేశారు. పిడమర్తి రవికి ఈ సారి ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కట్టించిందన్నారు. మహాకూటమి నేతలు సీట్లు పంచుకునే లోపే మనం స్వీట్లు పంచుకుందామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

More Telugu News