Telangana: పొన్నాలకు మళ్లీ మొండి చెయ్యి.. జనగామ అగ్నిగుండం అవుతుందని కాంగ్రెస్ నేతల వార్నింగ్!

  • రెండో జాబితాలోనూ పొన్నాలకు దక్కని చోటు
  • తీవ్రంగా స్పందించిన జనగామ కాంగ్రెస్ నేతలు
  • బీసీలు దూరమవుతారని హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ రోజు తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంపై జనగామ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 35 ఏళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న నేతకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం జనగామ టికెట్ ను పొన్నాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకవేళ పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కేటాయించకుంటే జనగామ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. పార్టీ అధిష్ఠానం చర్యలతో బీసీలు దూరమయ్యే పరిస్థితి నెలకొందని జనగామ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు వై. సుధాకర్‌, ధర్మపురి శ్రీను, అన్వర్‌, గిరికొండల్‌ రెడ్డి, మేడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News