station ghanpur: స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ: మాజీ మంత్రి విజయరామారావు

  • టికెట్‌ వేరొకరికి కేటాయించడం దారుణం
  • రాహుల్‌ ఆధ్వర్యంలో జరిగిన టికెట్ల కేటాయింపులోనూ ఇలా జరుగుతుందనుకోలేదు
  • పార్టీ కోసం నేను పడిన శ్రమంతా వృథా అయ్యిందని  వ్యాఖ్య

‘రెండేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యున్నతికి నేను పడిన శ్రమంతా వృథా అయింది. పార్టీనే నమ్ముకుని, నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన నన్ను వదిలేసి ప్యారాచూట్‌ అభ్యర్థికి టికెట్‌ కేటాయించడం దారుణం. పార్టీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. అందుకే స్టేషన్‌ఘన్‌ పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నాను’ అని మాజీ మంత్రి డాక్టర్‌ గుండె విజయరామారావు స్పష్టం చేశారు.

తెలంగాణలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గం టికెట్‌ను సింగపురం ఇందిరకు ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన తనకు టికెట్‌ రాకపోవడం అన్యాయమని, ఇది పార్టీలోని తన వ్యతిరేక శక్తులు పన్నిన కుట్రని ఆయన అన్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో జరిగిన టికెట్ల కేటాయింపులో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. ‘నేను కచ్చితంగా పోటీ చేస్తాను. ఇందిరతోపాటు డాక్టర్‌ టి.రాజయ్యను ఓడిస్తాను’ అని స్పష్టం చేశారు.

More Telugu News