pink diamond: స్విట్జర్లాండ్ లో ‘పింక్ డైమండ్’ వేలం.. భారీ ధర పలికిన అరుదైన వజ్రం!

  • వేలం చేపట్టిన క్రిస్టీస్ సంస్థ
  • దక్కించుకున్న అమెరికా కంపెనీ
  • భారీగా ధర పలికిన పింక్ డైమండ్ గా రికార్డు

అత్యంత అరుదైన రకానికి చెందిన ‘పింక్ లెగసీ’ వజ్రానికి భారీ ధర పలికింది. నిన్న రాత్రి స్విట్జర్లాండ్ లోని జెనీవాలో నిర్వహించిన వేలంలో 19 క్యారెట్లు ఉన్న ఈ వజ్రం ఏకంగా రూ.360 కోట్ల ధర దక్కించుకుంది. క్రిస్టీస్ సంస్థ చేపట్టిన వేలంలో అమెరికాకు చెందిన హ్యారీ విన్ స్టన్ సంస్థ ఈ వజ్రాన్ని సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా క్రిస్టీస్ సంస్థ మాట్లాడుతూ.. ఈ వజ్రం దక్షిణాఫ్రికా వజ్రపు గనుల్లో దొరికిందని తెలిపింది. దీన్ని ఓపెన్ హైమీర్ అనే కోటీశ్వరుల కుటుంబం దక్కించుకుందని వెల్లడించింది. 1920లో దీన్ని సానపట్టారనీ, అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేపట్టలేదని వెల్లడించింది.

గతంలో 15 క్యారెట్ల బరువున్న ఓ పింక్ వజ్రం రూ.234 కోట్ల ధర పలకగా, తాజాగా పింక్ లెగసీ దాన్ని అధిగమించిందని పేర్కొంది. కాగా, ఈ వజ్రాన్ని దక్కించుకున్న హ్యారీ సంస్థ దీనికి ‘విన్ స్టన్ పింక్ లెగసీ’ అని పేరు పెట్టింది.

More Telugu News