Suryapet District: రెండేళ్ల పాటు కోరిక తీర్చుకుని కాదు పొమ్మన్నాడు... ఎస్పీ కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం!

  • మత్తుమందిచ్చి అత్యాచారం
  • పెళ్లి చేసుకుంటానని సహజీవనం
  • మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్నం

పెళ్లి చేసుకుంటానని చెబుతూ రెండేళ్ల పాటు కోరిక తీర్చుకున్న తన ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ, ఉమారాణి అనే యువతి సూర్యాపేట ఎస్పీ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన ఉమారాణి, డిగ్రీ తరువాత హైదరాబాద్‌ లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా, దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన ఎస్బీఐ ఉద్యోగి శ్రీకాంత్‌  పరిచయం అయ్యాడు.

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఉమారాణికి శీతల పానీయంలో మత్తు మందు కలిపిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఉమారాణి నిలదీయగా, కులాలు ఒకటేనని గుర్తు చేస్తూ, తన చెల్లికి వివాహం కాగానే, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఆపై రెండేళ్ల పాటు మోసపు మాటలతో తన శారీరక అవసరాలను తీర్చుకుంటూనే వచ్చాడు.

ఇటీవల శ్రీకాంత్‌ చెల్లెలు పెళ్లి అయిపోయింది. ఆ వెంటనే తన మేనత్త కుమార్తెతో శ్రీకాంత్, తన పెళ్లిని నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉమారాణి, 20 రోజుల క్రితం సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేసింది. తొలుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన అధికారులు, ఆపై వారి ప్రేమాయణం ఇక్కడ సాగలేదు కాబట్టి, కేసు ఇక్కడ పెట్టలేమని చెప్పారట. దీంతో తన మనో వేదనను ఎస్పీకి చెప్పుకోవాలని వచ్చిన ఆమె, చాలా సేపు ఎదురుచూసి, పురుగుల మందు తాగింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వివరాలు సేకరించారు.

More Telugu News