Chandrababu: కేసీఆర్ నిండా మునగడం ఖాయం: చంద్రబాబు

  • తెలంగాణలో మహాకూటమి గెలుపు ఖాయం
  • అప్రతిష్ఠకు గురైన ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చిన కేసీఆర్
  • జగన్, బీజేపీ మధ్య లోపాయకారీ ఒప్పందం
  • టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు

తెలంగాణలో జరిగే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఎంతోమంది అప్రతిష్ఠకు గురైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని ఆరోపించిన ఆయన, వారెవరూ గెలిచే పరిస్థితి లేదని అన్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక భవనంలో జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో తెలంగాణ ఎన్నికల అంశం ప్రస్తావనకు రాగా, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నిరంకుశంగా వ్యవహరిస్తూ, సామాన్యులను అవస్థల పాలు చేసిన నరేంద్ర మోదీకి, కేసీఆర్ మద్దతు పలుకుతున్నారని, ఆయన వేస్తున్న తప్పటడుగులే కొంప ముంచనున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో జగన్, బీజేపీ మధ్య లోపాయకారీ ఒప్పందం నడుస్తోందని, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జగన్ చేసిన ఒత్తిడి ఫలితంగానే నిలిచిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ వినోద్ చెప్పారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారం అవసరం లేదని, ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయరాదన్నదే తమ లక్ష్యమని అన్నారు.

More Telugu News