Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ ఓటమి కోసం అహర్నిశలు కష్టపడతా: టీడీపీ నేత మల్లయ్య యాదవ్ హెచ్చరిక

  • త్యాగాలకు సిద్ధ పడాలంటూ మాకు సీట్లివ్వరా!
  • సిట్టింగ్ సీట్లను టీడీపీ త్యాగం చేసింది
  • నల్గొండ జిల్లా మొత్తం అగ్ర కులాలకే కట్టబెడతారా?

టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ నాయకుడు మల్లయ్య యాదవ్ నిప్పులు చెరిగారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఉత్తమ్ ,ఆయన భార్య పద్మావతి ఓడిపోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. త్యాగాలకు సిద్ధ పడాలన్న ఉత్తమ్ తమకు సీట్లివ్వకుండా గొంతు కోస్తారా? ఇంటికి ఒకరికే పదవి అని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదా? ఉత్తమ్ కుమార్ కాళ్ల దగ్గర సాగిలబడాల్సిన అవసరం మా నాయకులకు ఉందా? అంటూ నిప్పులు చెరిగారు.

తనకు టికెట్ రాకపోవడానికి కారణం తమ పార్టీ బలహీనత, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థం ఉందని విమర్శించారు. ఉత్తమ్ భార్య పద్మావతికి, కోదాడ నియోజకవర్గానికి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. సిట్టింగ్ సీట్లను త్యాగం చేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిట్టింగ్ సీట్లను ఎందుకు అడగదు? నల్గొండ జిల్లా మొత్తం అగ్ర కులాలకే కట్టబెడతారా? టీడీపీలో ఒక్క యాదవుడికి కూడా టికెట్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఉత్తమ్ దగ్గర పార్టీని తాకట్టుపెట్టిందని, ఉత్తమ్ అవినీతి బండారం బయటపెడతానని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.

More Telugu News