Atchutan: శబరిమల పులుల అభయారణ్యం.. పులులకే వదిలేద్దాం: పర్యావరణవేత్త సూచన

  • కేరళ పునర్నిర్మాణం అంశంపై మాట్లాడిన అచ్యుతన్
  • చిన్న విషయం గురించి సమయం, శక్తి వృథా
  • మరిన్ని నిర్మాణాలు చేపడితే గుడికే ప్రమాదం

ఇటీవల వరదల కారణంగా కేరళ పూర్తిగా ధ్వంసమైంది. ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ విషయాన్ని మరిచిపోయేందుకు ఎంతో సమయం పట్టలేదు కేరళ వాసులకు. ఇటీవల శబరిమలలో 10-50 ఏళ్లలోపు మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రజలంతా వరదల విషయాన్ని మరచిపోయి శబరిమల గొడవను తలకెత్తుకున్నారు. దీనిపై స్పందించిన అచ్యుతన్ అనే పర్యావరణవేత్త ఆగ్రహం వ్యక్తం చేశారు.

రివల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపీఐ) ఆధ్వర్యంలో వరదల అనంతరం కేరళ పునర్నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో అచ్యుతన్ మాట్లాడారు. మగవాళ్లు వద్దు, ఆడవాళ్లు వద్దు, అది పులుల అభయారణ్యం.. పులులకే వదిలేద్దామంటూ సూచన చేశారు. కేరళ పునర్నిర్మాణం గురించి మాట్లాడుకోవాల్సిన సమయంలో ఓ చిన్న విషయం గురించి సమయాన్ని, శక్తిని వృథా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమలపై గతంలో జరిపించిన సర్వేలో అచ్యుతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన అభివృద్ధి పేరిట మరిన్ని నిర్మాణాలు చేపడితే గుడికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.

More Telugu News