Telangana: ప్రజా కూటమి గెలిస్తే కొడుకు ఆంధ్రాలో, తండ్రి తెలంగాణలో సీఎం అవుతారు!: బీజేపీ నేత కృష్ణసాగరరావు

  • కాంగ్రెస్ అభ్యర్థులను చంద్రబాబు ఎంపికచేశారు
  • ఉత్తమ్ పార్టీపై పట్టును కోల్పోయారు
  • బీజేపీ కింగ్ మేకర్ గా మారుతుంది

కాంగ్రెస్ తొలిజాబితాలో భాగంగా ప్రకటించిన 65 మంది అభ్యర్థులు ఎప్పుడూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనలేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు తెలిపారు. వీరంతా కేవలం అభ్యర్థులు మాత్రమేననీ, నాయకులు కాదని వ్యాఖ్యానించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడో పట్టును కోల్పోయారని కృష్ణసాగరరావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు రూపొందించారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఫ్రాంచైజీని తెలంగాణలో చంద్రబాబు కొనుక్కున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ తెలంగాణలో ప్రజా కూటమి(మహాకూటమి) అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇక్కడ సీఎం అవుతారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలను లోకేశ్ కు అప్పగిస్తారన్నారు. ప్రజాకూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారనీ, కాబట్టి ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో బీజేపీ కింగ్ మేకర్ గా అవతరిస్తుందని కృష్ణసాగరరావు జోస్యం చెప్పారు.

More Telugu News