owl: యువతిని ఆకర్షించేందుకు గుడ్లగూబను బలిచ్చిన వ్యక్తి... అరెస్ట్!

  • ఓ యువతిని ఇష్టపడ్డ ట్రక్ డ్రైవర్
  • ఆమె తనను ఇష్టపడేందుకు తాంత్రిక విద్యను ఆశ్రయించిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

తనకు నచ్చిన ఓ యువతిని వశీకరణ చేసుకునేందుకు ఓ వ్యక్తి ఒక గుడ్లగూబను బలిచ్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుల్తాన్ పురికి చెందిన కన్హయ్య (40) అనే వ్యక్తి ట్రక్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓ యువతిని ఇష్టపడిన కన్హయ్య... ఆమెను తనను ఇష్టపడేలా చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఓ తాంత్రిక విద్యను ఆశ్రయించిన అతను... ఆమెను వశీకరణ చేసుకునేందుకు ఓ గుడ్లగూబను బలి ఇవ్వాలనుకున్నాడు.

ఈ క్రమంలో ఓ గుడ్లగూబను ఇంటికి తీసుకొచ్చి... తొలుత కత్తితో దాని కాళ్లను కట్ చేశాడు. ఆ తర్వాత ఊపిరితిత్తులు, కాలేయంలో గుండుసూదులు గుచ్చి, ప్రాణాలు తీశాడు. ఈ ఘటనకు సంబంధించి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఫిర్యాదు అందడంతో... పోలీసులు కన్హయ్య ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న కూలర్ లో గుడ్లగూబ మృతదేహాన్ని కనుగొన్నారు. గుడ్లగూబ శరీరంలో గుండుసూదులను గుచ్చడం వల్లే అది మరణించిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా కన్హయ్య తీశాడు. ఆ వీడియోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడ్లగూబ అతనికి ఎలా దొరికింది? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో... అనారోగ్యంతో కదలలేని స్థితిలో గుడ్లగూబ తనకు కనిపించిందని... దాన్ని ఇంటికి తీసుకొచ్చానని అతను తెలిపాడు. అయితే, గుడ్లగూబకు ఎలాంటి అనారోగ్యం లేదని పోస్టుమార్టంలో తేలింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 

More Telugu News