Uttam Kumar Reddy: నాడు బీ-ఫామ్ లు ఇచ్చిన వ్యక్తి... నేడు బీ-ఫామ్ కోసం క్యూలో!

  • ఢిల్లీకి చేరుకున్న పొన్నాల లక్ష్మయ్య
  • తన పేరు తొలి జాబితాలో లేకపోవడంపై అసంతృప్తి
  • కాసేపట్లో ఉత్తమ్ కుమార్ తో చర్చలు

తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఎదురైంది. నిన్న ప్రకటించిన తొలి జాబితాలో ఆయనకు స్థానం దక్కకపోవడం, ఆయన కోరుతున్న జనగామ స్థానాన్ని టీజేఎస్ కు కేటాయించే అవకాశాలు ఉండటంతో, తన భవిష్యత్తును హస్తినలోనే తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వేళ, ఎమ్మెల్యేలకు బీ-ఫామ్ లను తన చేతులతో ఇచ్చానని, ఇప్పుడు తానే బీ-ఫామ్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఢిల్లీ వచ్చిన ఆయన తనను కలిసిన నాయకుల వద్ద వాపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పక్కన పెట్టాలని ఎందుకు భావిస్తోందో తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరికాసేపట్లో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవనున్నారు.

కాగా, పొన్నాలతో చర్చించి ఆయన్ను బుజ్జగించాలని, తదుపరి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పాలని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవని ఆయనకు సర్దిచెప్పే ఆలోచనలో ఏఐసీసీ పెద్దలు ఉన్నట్టు సమాచారం.

More Telugu News